-
అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలు దుబాయ్కి అనుసంధానం
-
ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ ఎగ్జిక్యూటివ్లతో సీఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశమయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లో అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మధ్య ప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉందని చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్ కి అనుసంధానం చేయవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను ఎమిరేట్స్ హబ్గా తీర్చిదిద్దటం ద్వారా ఉభయ దేశాల స్నేహబంధం మరింత బలపడుతుందని చంద్రబాబు అన్నారు. తమకు ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్స్, పోర్ట్స్ ల ప్రతినిధుల బృందంతో ఒక టాస్క్ ఫోర్స్ ఉందని, ఇరువురం సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పని చేద్దామని ముఖ్యమంత్రి కి ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ ప్రతిపాదించారు.
పట్టుబట్టి ‘ఎమిరేట్స్’ను హైదరాబాద్ తెచ్చారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎమిరేట్స్ ను మొదటిసారి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎంతో చొరవ తీసుకున్నారని ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్ గుర్తు చేసుకున్నారు. ఒక పని తలపెడితే చంద్రబాబు కార్యదీక్ష ఎటువంటిదో తమకు ఇంకా జ్ఞాపకం ఉందన్నారు. ఇప్పటికీ చంద్రబాబులో అదే ఉత్సాహాన్ని చూస్తున్నామని ప్రశంసించారు.
సుల్తాన్ అల్ మన్సూరీతో చంద్రబాబు భేటీ
ఐటి, బ్లోక్ చైన్,ఫిన్ టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో కలసి పనిచేయడానికి ఫెడరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరీ సంసద్ధత వ్యక్తం చేశారు. ఆదివారం దుబాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మన్సూరీతో సమావేశమయ్యారు. భారతదేశం మొత్తానికి భౌగోళికంగా ఏపీ వ్యూహాత్మక సవ్యదిశలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రహదారి, రైలు, జలమార్గాలతో దేశం మొత్తానికి మంచి అనుసంధానం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు.
ఇండియాకు వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే అందులో ఒక్క తమ రాష్ట్రానికే దాదాపు వేయి కి.మీ సాగరతీరం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. తమ రాష్ట్రానికి సమాంతరంగా రహదారి అనుసంధానం ఉందని దాంతో పాటు అంతర్గత జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ‘మీ నైపుణ్యంపై మాకు మంచి గురి ఉంది. ఏపీతో దుబాయ్, సింగపూర్, హాంగ్కాంగ్ వంటి అంతర్జాతీయ నగరాలను జల, వాయుమార్గాలలో అనుసంధానం చేయాలని భావిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీలో ఏపీకి ఉన్న అనుభవం, నైపుణ్యం మీకు తెలుసని, అత్యుత్తమ మానవ వనరులు తమ సొంతమని, ఏపీ ప్రజలు ఏరంగంలోనైనా దూసుకెళ్లగల ఉత్సాహం ఉన్నవారని ముఖ్యమంత్రి చెప్పారు.
ఏపీలో రవాణా మార్గాల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి ఫలాలు అందుకోవడం మమ్మల్ని తమను ఎంతో ఆకట్టుకుందని, ముఖ్యంగా రాష్ట్రాన్ని రవాణా మార్గాల దిశగా అభివృద్ధి చేస్తున్న తీరు బాగుందని ఫెడరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరీ ప్రశంసించారు. యుఏఈ లాజిస్టిక్స్ రంగంలో విజయవంతంగా ముందుకువెళ్లిందని గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఉభయులం కలిసి పనిచేద్దామన్నారు. వేగవంతంగా సరుకు రవాణా చేయడం, అంతేవేగంగా ప్రయాణీకుల్ని కూడా గమ్యస్థానాలకు చేర్చడమన్నది విమానరంగంలో ఉన్న ముఖ్యమైన సవాల్ అని మన్సూరి స్పష్టం చేశారు.
ఇండియా, యుఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగ్గా, ధృఢంగా ఉన్నాయని, యుఎఇకు ఇండియా ప్రధమ వాణిజ్య భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. ఉభయ ప్రభుత్వ వర్గాలతో సయుక్త కార్య బృందం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కార్యబృందంలో తమ తరపు ప్రతినిధులను త్వరలో ఖరారుచేసి తమ రాయబారి ద్వారా తెలియజేస్తామని యుఎఇ ఆర్థికమంత్రి మన్సూరీ ప్రకటించారు. ఈ సమావేశంలో సమావేశంలో రాయబారి నవదీప్ సింగ్ సూరీ పాల్గొన్నారు.
విశాఖ, విజయవాడల్లో దుబాయ్ తరహా పర్యాటక ఆకర్షణలు
-బుర్జ్ ఖలీఫాను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కృష్ణా నదికి అభిముఖంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో, సాగరతీరం విశాఖలో బుర్జ్ ఖలీఫా దగ్గర సముద్ర భాగంలోని అట్లాంటిస్ హోటల్, ఆక్వా వెంచర్ పార్కు తరహా పర్యాటక ఆకర్షణలు ఉండి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మలచే కృషిలో భాగంగా శనివారం రాత్రి సమావేశాలు ముగిశాక దుబాయ్ నగరంలోని ముఖ్య ఆకర్షణీయ ప్రదేశాలను ఆయన మంత్రులు, అధికారులతో కలసి సందర్శించారు. ఏపీ పర్యాటక రంగంలో ఇటువంటి ఆకర్షణలు జత చేస్తే మరింత ఆహ్లాదంగా, అద్భుతంగా ఉంటుందని ఆయన మంత్రులకు, అధికారులకు సూచించారు.
తొలుత ప్రపంచ ప్రఖ్యాత ఆకాశసౌధం (2,717 అడుగులు) ‘బుర్జ్ ఖలీఫా’ సందర్శన. ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ నిర్వాహకులు ముఖ్యమంత్రి బృందాన్ని సాదరంగా ఆహ్వానించి నిర్మాణ విశేషాలను వివరించారు. అత్యంత ఎత్తయిన మానవ కట్టడంగా ఈ టవర్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మొత్తం 20 బిలియన్ అమెరికన్ డాలర్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ‘డౌన్టౌన్ దుబాయ్’ ప్రాజెక్టులో భాగంగా 1.5 బిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ‘బుర్జ్ ఖలీఫా’ నిర్మించారు. ఇందులో 30 వేల నివాస గృహాలు, పార్కుల్యాండ్ సహా 9 హోటళ్లు, 19 నివాస భవంతులు, దుబాయ్ మాల్, 12 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ నిర్మిత బుర్జ్ ఖలీపా సరస్సు, 76 వ అంతస్థులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్విమ్మింగ్ పూల్, వెలుపలి భాగంలో 902 అడుగుల ఎత్తున రంగురంగుల కాంతులతో నీటిని విరజిమ్మే ది దుబాయ్ ఫౌంటెన్ ఉన్నాయి.