ఏపీలో ఏరోసిటీ

5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ సంసిద్ధత..
పూర్తయితే 15,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి..
ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటనలో కంపెనీతో ఇడిబి ఎంఒయు

ఆంధ్రప్రదేశ్ లో ఏరోసిటీ నిర్మాణానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని మహ్మద్ అబ్దుల్ రెహమాన్ మహ్మద్ అల్ జూరానీ కి చెందిన ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యుఎఇ పర్యటన రెండోరోజున ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఏరోసిటీకి దశలవారీగా 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎకనమిక్ డెలవప్‌మెంట్ బోర్డు (ఇడిబి) ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఎపి ఇడిబి సీఈవో జాస్తి కృష్ణ కిశోర్ ఒప్పందంపై సంతకం చేశారు.

ఏరో సిటీ పూర్తయితే 15,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏవియేషన్ సిటీగా నిర్మించే ఏరోసిటీ నిర్మాణంలో అత్యంత అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. దేశవిదేశాల నుంచి విజ్ఞానాన్ని తీసుకురావడం తమ ప్రాధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న ప్రాజెక్టు అని అన్నారు. ఎక్కడ స్థాపించాలన్నదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ఏరోసిటీ స్థాపనకు 10 వేల ఎకరాల మేరకు భూమి అవసరమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ బృందం నవంబర్ మూడో వారంలో అధ్యయనానికి మన రాష్ట్రానికి రానున్నది. వచ్చే జనవరిలో దావోస్‌లో ప్రాథమిక నివేదిక అందజేస్తుంది.

Related posts

Leave a Comment