Read Time:1 Minute, 19 Second
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 రూపకల్పన కసరత్తు ప్రారంభమైంది. బడ్జెట్ తయారీపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. 2017-18 బడ్జెట్ సమయంలో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులు, పెట్టిన ఖర్చుల లెక్కలు తీయాలని యనమల ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ఆయా శాఖలు పెట్టిన ఖర్చులకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని మంత్రి అభిప్రాయపడ్డారు. టీడీపీ మ్యానిఫెస్టో ఆధారంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు యనమల సూచించారు. గృహ నిర్మాణం, కొత్త ఫించన్లకు ఎక్కువ కేటాయింపులు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించేలా పథకాలు రూపొందించాలని యనమల అభిప్రాయపడ్డారు.