కోదండరాం రాజకీయాస్త్రం

తెలంగాణ జెఎసికి అనుబంధంగా రాజకీయ పార్టీ
జెఎసి యధాతథం…నెలాఖరుకు లక్ష్య ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని పార్టీల నేతల నడకా కోదండరాం వైపే.. తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్ హోదాలో అప్పుడు రాజకీయ పార్టీలనే నిర్దేశించిన కోదండరాంకు… ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వంనుంచి తీవ్రమైన తిరస్కారం ఎదురైంది. జెఎసి తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. రాష్ట్ర విభజనే లక్ష్యంగా పని చేసిన సహచరుడికి ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్న వేళ… తెలంగాణలో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) గమ్యం, గమనం దేనికోసం అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అప్పటి జెఎసి అవసరం ఇప్పుడు యధాతథ రూపంలో కనిపించడంలేదు. దీంతో… జెఎసి తరఫున ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని కోదండరాం, ఆయన మద్ధతుదారులు నిర్ణయించారు. ‘తెలంగాణ జన సమితి (టిజెఎస్)’గా వ్యవహరిస్తున్న ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ‘నాగలితో రైతు’ కొత్త పార్టీ గుర్తుగా చెబుతున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రత్యేక రాష్ట్రంకోసం చేపట్టిన మహోద్యమం ‘మిలియన్ మార్చ్’ వార్షికోత్సవాన (మార్చి 10న) పార్టీ ఏర్పాటుకు కోదండరాం సిద్ధమవుతున్నారు. పార్టీ విధివిధానాలు, లక్ష్యాలను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని ఆయన ఆదివారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ జెఎసి యధాతథంగా ఉంటుందని, దానికి వెలుపల రాజకీయ పార్టీ పని చేస్తుందని కోదండరాం చెప్పారు. జెఎసి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న కోదండరాం రాజకీయ పార్టీలో ఏ పాత్ర పోషిస్తారన్న అంశంపై రానున్న కొద్ది రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారట.

సూత్రరీత్యా పార్టీ ఏర్పాటు చేయాలా లేదా అన్న అంశంపైనే ఆదివారం నిర్ణయం తీసుకున్నట్టు కోదండరాం చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే రాజకీయ పార్టీ అవసరమని జెఎసిలో ఎక్కువమంది భావించినట్టు కోదండరాం వెల్లడించారు. తమతో కలసి వచ్చేవారు చాలామంది ఉన్నారని, వారితో చర్చించిన తర్వాత ఈ నెలాఖరులో లక్ష్యాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment