ప్రతీ గ్రామంలో జరగాలన్న ముఖ్యమంత్రి
10 రోజులు పండుగలా కార్యక్రమాలు
జనవరి 2 నుంచి 11 వరకు జరిగే ఐదో విడత ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో భాగంగా… 7వ తేదీన ప్రతీ గ్రామంలో 5 కిలోమీటర్ల పరుగును నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం సన్నాహాలను ముఖ్యమంత్రి గురువారంనాడు సమీక్షించారు. రాష్ట్రంలో జన్మభూమి జరిగినన్ని రోజులూ (పది రోజులు) పండుగ వాతావరణం నెలకొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఒక్కో రోజు ఒక్కో క్రీడా పోటీలను గ్రామస్థాయిలో నిర్వహించాలని, ప్రధానంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. క్రీడా పోటీల్లో విజేతలకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని, ‘జన్మభూమి-మాఊరు’తో సరికొత్త క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేలా కృషి జరగాలని సూచించారు. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి ‘జన్మభూమి-మాఊరు’ను విజయవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక కోఆర్డినేటర్ చొప్పున నియమించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
జన్మభూమి చివరి రోజైన జనవరి 11న లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు 2 లక్షల మందికి వివిధ ప్రయోజనాలను పంపిణీ చేస్తామని సిఎం చెప్పారు. జన్మభూమిలో ఒక్కోరోజు ఒక్కో అంశం ఆధారంగా కార్యక్రమాలు నిర్వహించాలన్న సిఎం… ఆయా అంశాలపై వ్యాసరచన, చిత్రలేఖనం, రంగవల్లులు, వ్యక్తృత్వ పోటీలు జరపాలని సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం ‘జన్మభూమి-సంక్రాతి సంబరాలు’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలోని అత్యుత్తమ వ్యాసాలు, చిత్రాలు, ప్రసంగాల సారాంశంతో పుస్తకాలు ప్రచురించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.