అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం ఒక్కటే నిర్మించాలని, ‘రామజన్మభూమి’లో మరే నిర్మాణమూ జరగదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఈ మాట అది అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చని, కానీ అది తమ విశ్వాసానికి సంబంధించిన అంశమని, అందులో మార్పేమీ రాదని ఉద్ఘాటించారు.
శుక్రవారం కర్నాటకలోని ఉడుపి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్ పి) ‘ధర్మ సంసద్’లో భగవత్ మాట్లాడారు. మందిరాన్ని నిర్మించి తీరతామన్న భగవత్, గతంలో పోగు చేసిన రాళ్ళతోనే… 20-25 సంవత్సరాలుగా మందిరంకోసం పోరాడుతున్నవారి నాయకత్వంలోనే నిర్మాణం జరుగుతుందని ఉద్ఘాటించారు.
‘అనేక సంవత్సరాల ప్రయత్నాలు, త్యాగాల తర్వాత ఈ పని (మందిరం నిర్మాణం) ఇప్పుడు సాధ్యమవుతున్నట్లు గోచరిస్తోంది’ అని భగవత్ పేర్కొన్నారు. అదే సమయంలో ఈ అంశం కోర్టులో ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రజా చైతన్యం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
మనం మన లక్ష్య సాధనకు దగ్గర్లో ఉన్నాం. అయితే, ఈ తరుణంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి’’
రెండు రోజుల వీహెచ్ పి సమావేశాల్లో పాల్గొన్న మోహన్ భగవత్… దేశంలో గోహత్యపై సంపూర్ణ నిషేధం విధించవలసి ఉందని ఉద్ఘాటించారు. గోహత్యపై నిషేధం లేకపోతే… శాంతియుతంగా ఉండలేమని వ్యాఖ్యానించారు.