ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశు సంపద అభివృద్ధి, తద్వరా మాంస పరిశ్రమ అభివృద్ధి, ఎగుమతులకోసం మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మాంసాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి తీర్మానించింది. రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ’మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ వివరాలివి..
• మాంసం ఎగుమతులను ప్రోత్సహిస్తారు. సమీకృత మాంస శుద్ధి ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు. మాంస పరిశ్రమలో పనిచేసే వారికి అవసరమైన శిక్షణ కల్పిస్తారు.
• ఉప ఉత్పత్తులను ప్రోత్సహిస్తారు. షేర్ క్యాపిటల్గా రూ. 5 లక్షలు, రికరింగ్ వ్యయంగా ఏటా రూ. కోటి చొప్పున నిధులను పశు సంవర్ధక శాఖ ఈ కార్పొరేషన్కు అందిస్తుంది.
• పశువులు, పశు దాణాకు సంబంధించిన రవాణా, నిల్వ వసతులను కల్పిస్తారు. పశుదాణాలో పోషక విలువలు పెంచడానికి చర్యలు తీసుకుంటారు.
• రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా కృషి చేస్తారు.
• మాంసం, మాంస ఉత్పత్తుల తనిఖీకి సంబంధించిన సేవలు అందుతాయి. పశువైద్య సేవలు అందిస్తారు.
• పక్కా తనిఖీలతో పశువధశాలలను, మాంస ఉత్పత్తులను పర్యవేక్షిస్తారు. అవసరాలకు తగ్గట్టుగా వధశాలలను ఆధునీకరిస్తారు.
• పశువధశాలలను పరిశుభ్రంగా నిర్వహించడానికి వీలుగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వాటి నిర్వహణ చేపడతారు.
• పశువధశాలలలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
• ఆక్వేరియమ్లో పెంచే చేపల సంవృద్ధి కూడా ఈ సంస్థ ద్వారానే చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
• ఈ సంస్థ ఏర్పాటుతో డాల్ఫిన్ తరహా జలచరాలు, సముద్ర ఉత్పత్తులు, జల క్రీడలకు రాష్ట్రం ముఖ్య చిరునామాగా మారాలని చెప్పారు.