పరిశీలనలో వడ్డీ మాఫీ, పంటల బీమా ప్రీమియం మినహాయింపు
2019 ఎన్నికలే లక్ష్యంగా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు రాయితీలు ప్రకటించబోతున్నారు. సోమవారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘రైతు ప్యాకేజీ’ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.
రైతులకు ఏ రూపంలో రాయితీలు ఇవ్వాలన్న అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ విభిన్నమైన ప్రతిపాదనలను రూపొందించింది. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ చేయడం అందులో ఒక ప్రత్యామ్నాయంగా తెలుస్తోంది.
పంటల బీమా ప్రీమియంలో రైతు వాటాను పూర్తిగా ఎత్తివేయడం మరో ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేసిన ‘రైతుబంధు’ తరహా పథకాలను కూడా కేంద్రం పరిశీలించింది.