మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా? డిపాజిట్ చేసే మొత్తం రూ. 50,000కు మించి ఉంటే ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలి. ఇకపైన మీ గుర్తింపును నిర్ధారించే ఒరిజినల్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్ళాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన నిబంధన ఇది. మనీ లాండరింగ్ నిరోధక నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ శాఖ ఈమేరకు గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అకౌంట్ ప్రారంభించేవారినుంచి, రూ. 50 వేలకు మించి లావాదేవీలు చేసేవారి నుంచి ఆధార్ నెంబర్, ఇతర అధికారిక పత్రాలు తీసుకోవడం బ్యాంకులకు తప్పనిసరి. స్టాక్ బ్రోకర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ నిబంధనలను పాటించాలి.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ), దానికి అనుబంధంగా వచ్చిన నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఖాతాదారుల గుర్తింపును కచ్చితంగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. రికార్డులను నిర్వహించి భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయు-ఇండ్) వంటి సంస్థలు కోరినప్పుడు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.