కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడంవల్లనే తాను ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చలో అసెంబ్లీ చేపట్టిన నేపథ్యంలో ఆయన సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదాపై ఇక్కడ హడావుడి చేస్తున్నవారు ఢిల్లీ వెళ్ళి పోరాడాలని చంద్రబాబు సూచించారు.
ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కావలసి ఉందన్ని సిఎం, రాష్ట్రానికి నిధుల అవసరం చాలా ఉందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీ అమలు విషయంలో రాజీపడే సమస్య లేదని, సాధించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదు లేఖలు రాశారని ఆక్షేపించారు.
కేంద్ర హామీలను నెరవేర్చుకోవడంకోసం తమతో కలసి రావాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చిన సిఎం, తనను విమర్శిస్తున్నవారంతా ఢిల్లీలో తమ వాణిని వినిపించాలని సూచించారు. రాష్ట్రంలో అనవసర ఆందోళనలతో ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించవద్దన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల విడుదలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎనిమిదేళ్ళలో ఖర్చు చేసినంత మొత్తంలో ఉపాధి నిధులను తాము గత మూడేళ్ళలో ఖర్చు చేశామని ఉద్ఘాటించారు.
ఉపాధి హామీ పథకంతో రాష్ట్రంలో సిమెంటు రోడ్లు వేశామన్నసిఎం, నిధుల కన్వర్జెన్స్ ను ప్రతిపక్షం వివాదాస్పదం చేస్తోందని విమర్శించారు. వచ్చే ఏడాదికల్లా మరుగుదొడ్లు, వర్మి కంపోస్టు యూనిట్లు, సిమెంటు రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించాలన్న నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.