-
ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించిన సీఆర్డీయే..
-
పాతవి, కొత్తవి కలిపి సామాజిక మాథ్యమాల్లో పోస్టులు
అమరావతి నగరంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే అసెంబ్లీ ఎలా ఉండాలి? లండన్ నగరానికి చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ అసెంబ్లీ కోసం మొత్తం 13 నమూనాలను రూపొందించింది. వాటన్నిటినీ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) బుధవారం సామాజిక మాథ్యమాల ద్వారా వెల్లడించింది. వాటిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఈ 13 డిజైన్లలో దేనికి ఎక్కువ మంది ప్రజలు ఓటు వేస్తారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దానికి అనుగుణంగా సీఆర్డీయే బుధవారం తన ఫేస్ బుక్ పేజీలో డిజైన్ల ఫొటోలను పోస్టు చేసి ఆ లింకును ట్విట్టర్ హ్యాండిల్ పైనా షేర్ చేసింది. ఈ 13 డిజైన్లలో కొన్ని ఇదివరకే వెల్లడించినవి కాగా, మార్పులు చేర్పుల తర్వాత తాజాగా వెల్లడించినవి మరికొన్ని. నార్మన్ ఫోస్టర్ పాత డిజైన్లను ఇటీవల పరిశీలించిన సిఎం… మెరుగులు దిద్దాలని సూచించిన విషయం తెలిసిందే. సినీ దర్శకుడు రాజమౌళి సలహాలను తీసుకోవాలని కూడా సిఎం సూచించారు.
ఇటీవల రాజమౌళి టీమ్ రంగంలోకి దిగి కొన్నిసూచనలు చేసింది. వాటికి అనుగుణంగా మార్పులు చేసిన డిజైన్లనూ బుధవారం సీఆర్డీయే వెల్లడించింది. మరోవైపు.. సిఎం స్వయంగా తాజా డిజైన్లను చూడటానికి ఈ నెల 24, 25 తేదీల్లో లండన్ వెళ్తున్నారు. ఈలోగా సదరు డిజైన్లపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని సిఎం భావించారు.