దేశంలో మోటారు పరిశ్రమ సంక్షోభంలో పడింది. గత 19 సంవత్సరాల్లో చూడని విధంగా జూలైలో అమ్మకాలు ఏకంగా 18.71 శాతం తగ్గాయి. గత రెండు, మూడు నెలల్లో 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఈ నేపథ్యంలో...
భారత మోటారు పరిశ్రమలో దిగ్గజ సంస్థ మహింద్రా & మహింద్రా తాత్కాలిక ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా తమ కంపెనీ 1,500 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా స్వయంగా చెప్పారు. పరిశ్రమలో మందగమనం ఇలాగే కొనసాగితే మరింతమందిని తమ కంపెనీ తొలగించక తప్పదని ఆయన తేల్చి చెప్పారు.
శ్రీలంకలో తమ కంపెనీ ఆటోమోటివ్ అసెంబ్లీ యూనిట్ ప్రారంభం సందర్భంగా గోయెంకా మీడియాతో మాట్లాడారు. వచ్చే పండుగ సీజన్లో ఈ రంగం సంక్షోభం నుంచి బయటపడకపోతే ఉద్యోగాలు, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని, వాహనాల అమ్మకందారులు దివాళా తీస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 6-8 నెలల్లో భారత ప్రభుత్వం సాయం అందిస్తే పెద్ద మార్పును చూడవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం నుంచి ఉద్ధీపన ప్యాకేజీ!
ప్రభుత్వం నుంచి ఆర్థిక ఉద్ధీపన ప్యాకేజీ అవసరమా? అని విలేకరులు అడిగినప్పుడు.. గోయెంకా అవునని ఉద్ఘాటించారు. గతంలో మందగమనం సంభవించినప్పుడు రెండుసార్లూ ప్రభుత్వం ఆర్థిక ఉద్ధీపన అందించిందని, అవి బాగా పని చేశాయని పేర్కొన్నారు.