2019 ఎన్నికలకోసం పవన్ కళ్యాణ్ ప్రస్థానం మొదలైంది. ఆత్మహత్యలు చేసుకున్నవారి పరామర్శతో తన పర్యటనలను ఆరంభించాలని జన సేన అధినేత నిర్ణయించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్న మురళి (ఉస్మానియా యూనివర్శిటీ), వెంకటేశ్ (విజయనగరం జిల్లా), కృష్ణా నదిలో పడవ మునిగి మరణించినవారి కుటుంబాలను పరామర్శించడం తన బాధ్యతగా పవన్ పేర్కొన్నారు. ‘‘జనంలోకి జనంకోసం’’ అంటున్న పవన్, ట్విట్టర్ లో 10 రోజుల విరామం తర్వాత వరుస ట్వీట్లతో అదరగొట్టారు. వరుస ప్రకటనలు, వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై పరోక్ష విమర్శలు చేశారు.
మొదటిగా విజయనగరం జిల్లాలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు పవన్ వెల్లడించారు. చాాలా రోజుల విరామం తర్వాత ప్రజాక్షేత్రానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్… ట్విట్టర్ వేదికగా తన సుదీర్ఘ ప్రస్థానాన్ని రేఖామాత్రంగా వెల్లడించారు. అందులో భాగంగానే ‘‘చలో రే చలో రే చల్’’ అంటూ యువతకు ఓ పిలుపుతో కూడిన పాటను యూట్యూబ్ లో ఉంచారు. పవన్ 2014కు ముందు జన సేన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన రోజు ప్రవచించిన గుంటూరు శేషేంధ్ర శర్మ కవిత్వాన్ని ఆ పాటలో చొప్పించారు.