దేశ విభజన జరిగిన తర్వాత దక్షిణ కొరియా అనతి కాలంలోనే ఎలా అభివృద్ధి సాధించిందో… రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా రెండేళ్లలోనే రెండంకెల వృద్ధి రేటుతో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అక్కడ ఆ దేశం ఎలాగైతే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిందో… పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గురువారం వేకువజామున విజయవాడ చేరుకున్నారు. అనంతరం మధ్యహ్నం విశాఖపట్నం బయలుదేరే ముందు తన కొరియా పర్యటన వివరాలను మీడియా ఎదుట వెల్లడించారు. అవన్నీ ముఖ్యమంత్రి మాటల్లోనే…
- పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈనెల 4, 5, 6 తేదీలలో దక్షిణకొరియాలో మేము జరిపిన పర్యటన ఫలప్రదంగా, ప్రయోజనవంతంగా సాగింది.
- సియోల్, బూసన్ నగరాలలో పర్యటించాం. దక్షిణకొరియాలోని పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యాం. 2 రోడ్షో/బిజినెస్ సెమినార్లలో పాల్గొన్నాం. 2 ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఒక లెటరాఫ్ ఇంటెంట్ చేసుకున్నాం.
- కొరియా అభివృద్ధి నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. అనేక అవరోధాలను, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
- భౌగోళికంగా, జనాభా సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్కు, దక్షిణకొరియాకు సారూప్యతలు ఉన్నాయి. దక్షిణకొరియాలో ఉన్నట్టే ఏపీలో కూడా సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది.
- దక్షిణకొరియా ఎలాగైతే వేరుపడిందో ఇక్కడ కూడా అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుచేయబడింది.
- ఎలాగైతే దక్షిణకొరియా స్వల్పకాలంలోనే సొంతకాళ్లపై నిలబడగలిగిందో, అలానే ఇక్కడ కూడా రెండేళ్ల కాలంలోనే రెండంకెల వృద్ధి రేటుతో నవ్యాంధ్రప్రదేశ్ నిలబడింది.
- అక్కడ ఆ దేశం ఎలాగైతే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిందో, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ఉన్నది.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇప్పటికే మనం నెంబర్వన్గా నిలిచాం. డిస్టెంట్ నెంబర్వన్గా ఉండాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రమదానం, ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించాను. ఆ తరువాత వీటిని జన్మభూమి కార్యక్రమంలో ఇంటిగ్రేట్ చేశాం. ఈ పర్యాయం జన్మభూమి-మాఊరు పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. అక్కడ దక్షిణకొరియాలో కూడా ఇదే స్ఫూర్తితో SaemaulUndong పేరుతో ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇది రూరల్ సౌత్ కొరియన్ ఎకానమీని పూర్తిగా మార్చేసింది. ఆ విధంగా రెండు ప్రాంతాల్లో శ్రమదానం కార్యక్రమాలు గొప్ప ప్రజా ఉద్యమ కార్యక్రమాలుగా చరిత్రకెక్కాయి.
- జనాభాపరంగా మన రాష్ట్రంతో సమానంగా ఉన్న దక్షిణకొరియా జీడీపీలో మన దేశ జీడీపీతో పోటీపడుతోంది. అదే నాకు ఆశ్చర్యం కలిగించింది. 2016లో దక్షిణకొరియా GDP 411 ట్రిలియన్ US డాలర్లుగా ఉంటే, ఇండియా GDP 2.264 ట్రిలియన్ US డాలర్లుగా ఉంది. జనాభాపరంగా మన రాష్ట్రంతో సమానంగా ఉన్న ఆ దేశం GDPలో మాత్రం మన దేశ GDPతో పోటీపడటం మనకు స్ఫూర్తినిస్తోంది.
- తయారీ, సాంకేతిక రంగాలలో ముందంజలో వున్న దక్షిణకొరియా నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన కొనసాగించాం.
- గడచిన మూడేళ్లుగా ఏపీ స్థిరంగా సాధిస్తున్న రెండంకెల వృద్ధిని, పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించాం.
- ఏపీలో వున్నఅపారమైన అవకాశాలు వినియోగించుకోవాలని ఆహ్వానించాం. ఏపీలో పెట్టుబడులకు పెట్టేందుకు వున్న సానుకూలాంశాలు తెలియజేస్తూ వారి సందేహాలను తీర్చాం. ఎలాంటి వ్యాపార అవరోధాలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చాం.
- తొలిరోజు నుంచే మాకు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. కియా మోటార్స్ స్ఫూర్తితో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలకు సూచించాను. అన్ని మౌలిక సదుపాయాలతో మన రాష్ట్రంలో కొరియన్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించాం.
జరిపిన ముఖాముఖి సమావేశాలు: సుమారు 25 |
కుదిరిన MOUలు : 2 |
లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ (LOI) : 1 |
రోడ్షో/బిజినెస్ సెమినార్లు: 2 |
కలిసిన పారిశ్రామిక ప్రముఖులు వీరే : |
కియా సంస్థ ప్రెసిడెంట్ హూన్ వూ పార్క్ |
LG ప్రెసిడెంట్ సూన్ క్వోన్ |
లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్/సీఈవో వాంగ్ కాగ్ జు |
దాసన్ నెట్వర్క్ చైర్మన్ నామ్ మెయిన్ వూ |
జుసంగ్ ఇంజినీరింగ్ సీఈవో వాన్గ్ చుల్ జు |
ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్ |
కోకమ్ గ్రూపు సీఈవో జేజే హాంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిమ్ చాంగ్ మిన్ |
హేన్సోల్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్ |
గ్రాన్ సియోల్ (GS) ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ టె జిన్ కిమ్ |
BTN కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్ |
పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జూ సీ బో |
హ్యోసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జూంగ్ లీ |
గ్రీన్ క్రాస్ సెల్ సంస్థ ఎండీ లీ డక్ జూ |
‘కామా’ జాతీయ కార్ల కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిమ్ యాంగ్ హ్యూన్ |
హుందాయ్ మార్చంట్ మెరైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సూ హో కిమ్, జనరల్ మేనేజర్ డేవిడ్ |
డార్సిల్ (Darcl) డైరెక్టర్ బెన్నీ కాంగ్ |
OCI కంపెనీ సీఈవో వు హ్యూమ్ లీ |
డార్సిల్ (Darcl) డైరెక్టర్ బెన్నీ కాంగ్ |
కలిసిన ప్రభుత్వ ప్రముఖులు వీరే : |
బూసన్ మెట్రోపాలిటన్ సిటీ మేయర్ సుహ్ బ్యూంగ్ సూ |
బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్వాన్ |
దక్షిణ కొరియాలో భారత రాయబారి దొరైస్వామి |
బూసన్ పోర్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ బూ వో |
FEZ కమిషనర్ జింగ్ యంగ్ హ్యూమ్ |
- అవగాహన ఒప్పందం (MOU): ‘కియా’ అనుబంధ సంస్థలతో ఒక ఎంవోయూ చేసుకున్నాం. ఈ ఒప్పందంలో భాగంగా ‘కియా’ అనుబంధ సంస్థలన్నీ కలిపి రూ. 4,995.20 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
- అవగాహన ఒప్పందం(MOU): ఆంధ్రప్రదేశ్లో ‘కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ను ఏర్పాటవుతుంది. దీనిపై బూసన్లో జరిగిన బిజినెస్ సెమినార్లో ‘మేకిన్ ఇండియా కొరియా సెంటర్’(MIC)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎంవోయూలో భాగంగా బూసన్లో ఆంధ్రప్రదేశ్ సెంటర్ను నెలకొల్పుతాం.
- లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ (LOI): 37 కంపెనీలతో కూడినపారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB) ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ తీసుకుంది. వీటి విలువ మూడు వేల కోట్ల రూపాయలు. ఈ సంస్థల ద్వారా మొత్తం 7,171 ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
రెండు రోడ్ షో/బిజినెస్ సెమినార్లు :
- బూసన్ బిజినెస్ సెమినార్ : పర్యటన రెండోరోజు దక్షిణకొరియా పారిశ్రామిక నగరం బూసన్ సందర్శనకు సియోల్ వెళ్లాం. బూసన్లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్లో పాల్గొన్నాం.
- భారత్లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని దక్షిణ కొరియాలో భారత రాయబారి దొరైస్వామి కొరియన్ పారిశ్రామికవేత్తలకు పిలుపుఇవ్వడం మాకు చాలా సంతోషం కలిగించింది. ‘కియా’కు కేటాయించిన బంజరు భూమిని చదును చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. అలాంటిది మూడునెలల్లోనే పనులు పూర్తిచేసిన విషయాన్ని వారు గుర్తించడం సంతృప్తిని కలిగించింది.
- ‘కియా మోటార్స్’కు కేటాయించిన అభివృద్ధి పనుల విశేషాలపై ఆ బిజినెస్ సెమినార్లో లఘుచిత్రాన్ని ప్రదర్శించాం. ఆ సెమినార్కు హాజరైన ఇండస్ట్రియలిస్టులు అందరికీ ఈజీగా అర్థంకావడం కోసం కొరియన్ భాషలోనే ఏపీ విశేషాలను అందించాం.
- వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి వంటి అనేక అంశాలలో పరస్పరం సహకరించుకుందామని బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్వాన్ ప్రతిపాదించారు.
- పుక్యోంగ్ నేషనల్ యూనివర్శిటీ దక్షిణకొరియాలో ఉన్నఫిషరీస్ యూనివర్శిటీ. ఫిషరీస్ రంగంలో ఈ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు వున్న అవకాశాలపై బూసన్ వైస్ మేయర్ కిమ్ యంగ్వాన్తో చర్చించాం. ఈ విషయంలో పుక్యోంగ్ నేషనల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్తో సంప్రదింపులు జరుపుతామని కిమ్ యంగ్వాన్ హామీ ఇచ్చారు.
- ‘కియా’ బిజినెస్ సెమినార్ : చివరిరోజు కియా మోటార్స్, కొరియాలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సంయుక్త బిజినెస్ సెమినార్లో పాల్గొన్నాం.
- పెట్టుబడుల విస్తరణకుఆంధ్రప్రదేశ్ను సరైన స్థానంగా గుర్తించామని ‘కియా’ సంస్థ ప్రెసిడెంట్ హూన్ వూ పార్క్ చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
- బూసన్, కృష్ణపట్నం పోర్టుల అనుసంధానం ప్రస్తావనకు వచ్చింది. శ్రీసిటీ సెజ్, కాకినాడ ‘స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్’పై ప్రెజెంటేషన్ ఇచ్చారు.
- బూసన్ న్యూపోర్టు సందర్శన : దక్షిణ కొరియాలో ప్రఖ్యాతి గాంచిన బూసన్ న్యూపోర్టును సందర్శించాం. 2006లో ఈ పోర్టును ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులతో కలిసి పని చేయాలని బూసన్ పోర్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ బూ వోను కోరాం.
- కియా హెడ్ క్వార్టర్స్ సందర్శన : కియా మోటార్స్ హెడ్క్వార్టర్స్ సందర్శించాం.
- FEZసందర్శన :బూసన్ జిన్హే ఫ్రీ ఎకనమిక్ జోన్కు వెళ్లి చూశాం. గగనతలం, రైల్వే, సముద్ర రవాణా మార్గాలు కలిగిన ట్రైపోర్టుగా దీనికి గుర్తింపు వుంది. FEZ కమిషనర్ జింగ్ యంగ్ హ్యూమ్తో సమావేశమయ్యాం.
- ‘మేకిన్ ఇండియా కొరియా సెంటర్’కు వెళ్లి చూశాం. ఇండియన్ కాన్సులేట్ నిర్వహిస్తున్న భారత సాంస్కృతిక కేంద్రాన్ని సందర్శించాం.
ముఖాముఖి సమావేశాలు :
- బూసన్ మేయర్తో భేటీ : బూసన్ మెట్రోపాలిటన్ సిటీ మేయర్ సుహ్ బ్యూంగ్ సూతో భేటీ అయ్యాం. అమరావతి-బూసన్ మధ్య కొత్త స్నేహం ఉభయతారకంగా ఉండాలని ఆయన ఆశించారు.సిస్టర్ స్టేట్ రిలేషన్కు సిద్ధంగా ఉన్నామని సుహ్ బ్యూంగ్ సూ చెప్పారు. ఫిబ్రవరిలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు బూసన్ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామన్నారు.
ఇంకా ఎవరెవర్ని కలిశామంటే :
- కొరియాలో జాతీయ కార్ల తయారీ సంస్థ ‘కామా’ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిమ్ యాంగ్ హ్యూన్తో సమావేశమయ్యాం. కియా ఏపీలో అడుగుపెట్టిన తర్వాత చాలామంది కొరియన్ ఆటోమొబైల్ తయారీదారులు ఆంధ్రప్రదేశ్ పట్ల ఆసక్తి చూపుతున్నట్టు కిమ్ చెప్పారు. తమ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ పంపుతామని అన్నారు.
- హుందాయ్ మార్చంట్ మెరైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సూ హో కిమ్, జనరల్ మేనేజర్ డేవిడ్ సియోంగ్తో సమావేశమయ్యాం. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, కంటైనర్ బిజినెస్కు వున్న అవకాశాలను వివరించాం. కృష్ణపట్నం పోర్టును భారత్లో తమ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మార్చుకోవాలని భావిస్తున్నట్టు కిమ్ తెలిపారు.
- యంగ్వన్ సంస్థ చైర్మన్ సంగ్ కియాక్, అతని బృందంతో చర్చలు జరిపాం. గతంలో చెన్నై, కోయంబత్తూరులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించి విరమించుకున్నారు. ఈసారి అన్ని వసతులు కల్పిస్తాం, ఏపీకి రమ్మని కోరాం.
- ఓసీఐ కంపెనీ సీఈవో వు హ్యూమ్ లీతో చర్చలు జరిపాం. సౌరవిద్యుత్తు రంగంలో భారత్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు లీ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ విధానం తమను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.
- సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ LG ప్రెసిడెంట్ సూన్ క్వోన్ తో సమావేశమయ్యాం. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరగా సూన్ క్వోన్ సానుకూలంగా స్పందించారు. స్టోరేజ్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు.
- దక్షిణ కొరియాలోని అతిపెద్ద లాజిస్టిక్ సంస్థ డార్సిల్ (Darcl) డైరెక్టర్ బెన్నీ కాంగ్తో భేటీ అయ్యాం. మనం ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్ యూనివర్సిటీలో భాగస్వామి కావాలని అడిగాం. లాజిస్టిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా వున్నామని బెన్నీ చెప్పారు.
- లివర్, ప్రాంక్రియాటిక్ కాన్సర్ వ్యాధి చికిత్సకు సంభందించిన ఔషధాలపై పరిశోధన, ఉత్పత్తిలో పేరుగాంచిన గ్రీన్ క్రాస్ సెల్ సంస్థ ఎండీ లీ డక్ జూతో చర్చలు జరిపాం. తూర్పు ఆసియా దేశాలలో వ్యాపారాభివృద్ధికి ఆసక్తిగా ఉన్నామని లీ డక్ జూ చెప్పారు. ఏపీకి రావాలని ఆయన్ని కోరాను.
- విభిన్న వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ‘లొట్టే కార్పొరేషన్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సంయుక్త కార్యసాధన బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
- ‘లొట్టే కార్పొరేషన్’కు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా 90కు పైగా బిజినెస్ యూనిట్లు ఉన్నాయి.
- దాసన్ నెట్వర్క్ చైర్మన్ నామ్ మెయిన్ వూతో చర్చలు జరిపాం. భారీ పెట్టుబడులతో ఏపీకి రావాలని కోరాం.
- సాఫ్ట్వేర్, ఐవోటీ, ఈఎంసీ ఇంజనీరింగ్, ఆటో పార్ట్స్ సెక్టార్లలో ‘దాసన్ నెట్వర్క్’ గ్లోబల్ నెట్వర్క్ సొల్యూషన్ ప్రొవైడర్గా ఉంది. ఇప్పటికే ఈ సంస్థ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్వర్క్ లిమిటెడ్తో కలిసి పనిచేస్తోంది.
- ‘జుసంగ్ ఇంజినీరింగ్’ కంపెనీ తమ ఎక్స్పాన్షన్ యూనిట్ను ఏపీలోనే నెలకొల్పాలని ఆ సంస్థ సీఈవో వాన్గ్ చుల్ జును అడిగాను.
- లైటింగ్ ఎక్విప్మెంట్, సోలార్ సెల్స్, ఎల్సీడీ, ఓఎల్ఈడీ డిస్ప్లే, సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన సాంకేతికతలో జుసంగ్ టెక్నాలజీ ప్రఖ్యాతిగాంచింది. ఎస్కే హైనిక్స్, ఎల్సీ, శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 78 సంస్థలకు తమ ఉత్పత్తులను అందిస్తోంది.
- ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సొల్యూషన్స్ సంస్థ ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్ ఈనెల 10 తర్వాత ఆంధ్రప్రదేశ్కు వస్తానని చెప్పారు. ఇప్పటికే ఐరిటెక్ మనతో కలిసి పనిచేస్తోంది.
- ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, లిథియమ్ పాలిమర్స్ బ్యాటరీస్లో అగ్రగామిగా ఉన్నకోకమ్ గ్రూపు సీఈవో జేజే హాంగ్ సమావేశమయ్యాం. మనం కూడా ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్పై ఇటీవలి కాలంలో ఎక్కువ ఫోకస్ పెట్టాం. జీవితకాలం మొత్తం పనిచేసే బ్యాటరీల తయారీపై కోకమ్ గ్రూపు పరిశోధన చేస్తోంది. ఆ పరిశోధన ఫలించి జీవితకాల బ్యాటరీ ఆవిష్కరణ కనుక జరిగితే అది కచ్చితంగా అతి పెద్ద మలుపు అవుతుంది.
- నీటిశుధ్ధిపరిశ్రమల ఏర్పాటుపై హేనోల్స్ కెమికల్స్ ఆసక్తి చూపించింది. హేన్సోల్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్తో సంప్రదింపులు జరిపాం. నీటి శుద్ధికి ఉపయోగపడే రసాయనాలు, స్మార్ట్ ఫోన్లో వాడే పెయింట్ను ఈ సంస్థ తయారు చేస్తుంది.
- అథ్లెట్లకు శిక్షణకు ఉపకరించే స్టేడియం నిర్మాణాలలో ప్రసిద్ధిచెందిన గ్రాన్ సియోల్ (GS) ఇంజినీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీ ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్లు టె జిన్ కిమ్తోనూ సమావేశమయ్యాం. అమరావతి క్రీడానగరంలో పాలుపంచుకోవచ్చని సూచించాం.
- బీటీఎన్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్తో భేటీ అయ్యాం. దేశంలో మొదటి లోకల్ ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్టుసిటీని అనంతపురములో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. దక్షిణకొరియా-ఇండియా మధ్య 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ఒప్పందంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్మార్టుసిటీని ఏర్పాటుచేస్తున్నారు.
- భారత్లో ఎల్ఎన్జీ వాల్వ్ చెయిన్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జూ సీ బోతో సమావేశమయ్యాం.
- డౌన్ స్ట్రీమ్ పెట్రో కెమికల్స్ ఇండస్ట్రీపై పోస్కో దేవూ సంస్థ ఆసక్తి చూపించింది. కాకినాడ పరిసర ప్రాంతాలలోని పెట్రో కారిడార్లో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులకు వివరించాం.
- నైలాన్ పాలిస్టర్, పవర్ సిస్టమ్లలో అనుభవం వున్న హ్యోసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జూంగ్ లీతో చర్చలు జరిపాం. టెక్స్టైల్స్, గార్మెంట్ పరిశ్రమలపై వారు ఆసక్తిగా ఉన్నారు. భారత్లో తమ యూనిట్లను పెట్టేందుకు తగిన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నారు. ఏపీకి రావాలని వారికి సూచించాం.